హైదరాబాద్, ఏప్రిల్ 21, 2025: హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఉండే మంగలి బాలకృష్ణ 9 ఏళ్ల క్రితం గాంధీ హాస్పిటల్ దగ్గర గ్రేట్ఫుల్హెడ్సేవాఫౌండేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఫౌండేషన్ ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈఎస్ఐ హాప్సిటల్స్ తో సహా పలు అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, స్లమ్లు, రోడ్డుపై ఉండే వాళ్లకు అన్నం పంచుతుంది. ఇంకా, పేద పిల్లలకు చదువుకు సాయం, చలిలో దుప్పట్లు, వేసవిలో చలివేంద్రాలు, ఆవులు, కుక్కలు, పక్షులకు ఫీడింగ్, పిల్లలకు ఫ్రీ హెయిర్కట్స్, టీ స్టాల్స్ స్పాన్సర్షిప్, జైపూర్ లెగ్స్తో సపోర్ట్—ఇలా ఎన్నో చేస్తోంది.
“ఒక రోజు జేఎన్టీయూ సమీపంలో ఓ వృద్ధ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ, “బాబు, భోజనం కావాలి… బాగా ఆకలిగా ఉంది” అని అడిగింది. ఆ మాటలు నా మనసును చలించి పోయేలా చేసాయి, వెంటనే పక్కనే ఉన్న హోటల్కి వెళ్లి భోజనం పార్సెల్ తీసుకొచ్చి ఆ బామ్మకు అందించాను. ఆ వృద్ధురాలు ఆనందంతో ఆశీర్వదించగా, అక్కడి నుంచే ఈ సేవా మార్గం ప్రారంభమై, ఇప్పటికీ ఆగకుండా నిర్విరామంగా కొనసాగుతుంది” అని బాలక్రిష్ణ గారు తెలిపారు.
ఫౌండర్ & ప్రెసిడెంట్ మంగలి బాలకృష్ణతో పాటు యోగేష్ ప్రభు, నర్సింలు, యాదయ్య, భవానీ ప్రసాద్, నాగరాజు, వెంకట్, కుమారి ఆంటీ, వెంకటేశ్వర రావు, వీరు ఈ సేవలో భాగమై చేయి కలిపారు. “ఒక్క మనిషి ఆకలి తీర్చగలిగితే, అదే మాకు జీవితంలో అతిపెద్ద ఆస్తి” అని బాలకృష్ణ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. 9 ఏళ్లుగా ఈ ఫౌండేషన్ ఆగకుండా సేవ చేస్తూ అందరి మనసు గెలుస్తోంది!