Marri Rajasekhar resign To YSRCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేత వైసీపీకి గుడ్ బై చెప్పారు. 2011 నుంచి వైసీపీలో వైఎస్ జగన్ వెంట నడుస్తూ వచ్చిన మర్రి రాజశేఖర్.. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండానే టీడీపీలో చేరతానని మర్రి రాజశేఖర్ తెలిపారు. మరోవైపు మర్రి రాజశేఖర్ బుధవారం తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరులో విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆయన.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ వైఖరి, మోసం వలనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
2011లో కాంగ్రెస్ పార్టీ నుంచి తాను వైసీపీలో చేరినట్లు మర్రి రాజశేఖర్ తెలిపారు. అప్పటి నుంచి 14 ఏళ్లుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే 2019 ఎన్నికల సమయంలో చిలకలూరిపేటలో తన స్థానంలో మరో వ్యక్తిని ఎన్నికల్లో నిలబెట్టారన్న ఆయన.. తనను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటానని జగన్ హామీ ఇచ్చారన్నారు. మంత్రిని చేస్తానని బహిరంగంగా మాట ఇచ్చిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని ఆరోపించారు. తనకు కాకుండా వేరే వారికి మంత్రి పదవి ఇచ్చారని మర్రి రాజశేఖర్ ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన తనకు కనీస గౌరవం ఇవ్వకుండా.. మోసం చేశారంటూ మర్రి రాజశేఖర్ ఆరోపించారు.
2019లో చిలకలూరిపేట నుంచి గెలిచిన వ్యక్తి ..2024 ఎన్నికల సమయంలో గుంటూరుకు మారారన్న మర్రి రాజశేఖర్.. అప్పుడు కూడా తనకు చిలకలూరిపేటలో అవకాశం ఇవ్వలేదన్నారు. తనను సంప్రదించకుండా.. వేరేవారిని చిలకలూరిపేటలో వైసీపీ తరుఫున నిలబెట్టారని మర్రి రాజశేఖర్ తెలిపారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా.. గుంటూరులో ఓడిపోయిన వారిని తిరిగి చిలకలూరిపేట ఇంఛార్జిగా బాధ్యతలు అప్పగించారని మర్రి రాజశేఖర్ విమర్శించారు. అప్పుడు కూడా తనను, కార్యకర్తలను సంప్రదించలేదని.. ఈ నేపథ్యంలోనే ఆత్మగౌరవం కోసం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని.. త్వరలోనే టీడీపీలో చేరతానని మర్రి రాజశేఖర్ తెలిపారు.
మరోవైపు చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్గా మాజీ మంత్రి విడదల రజనీని వైఎస్ జగన్ నియమించడంతో మర్రి రాజశేఖర్ అసంతృప్తితో ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ చిలకలూరిపేట స్థానాన్ని మర్రి రాజశేఖర్ ఆశించారు. అయితే వైఎస్ జగన్.. విడదల రజినీకి అవకాశం ఇచ్చారు. 2024 ఎన్నికల్లో విడదల రజినీని గుంటూరుకు మార్చారు. అయితే గుంటూరులో విడదల రజినీ భారీ తేడాతో ఓటమి పాలవ్వడంతో తిరిగి చిలకలూరిపేట స్థానానికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే అసంతృప్తికి గురైన మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలిసింది.