సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా తన పాదయాత్ర ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భారీగా బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని చెప్పారు. ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని అన్నారు.
సూర్యాపేటలో జనాలను చూస్తే భారీ బహిరంగ సభకు వచ్చినట్లుగా ఉందని.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే అధికారమని కేటీఆర్ జోస్యం చెప్పారు. దేశంలో తెలుగువాళ్లు కూడా ఉన్నారని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చాటితే.. తెలంగాణ కూడా ఉందని కేసీఆర్ చాటారని అన్నారు. తెలుగు గడ్డపై పుట్టి దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన పార్టీలు టీడీపీ, బీఆర్ఎస్లేనని ఉద్ఘాటించారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మోకాళ్ల ఎత్తు కూడా లేని కొందరు శాసనసభలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని ఎన్ని మాటలు చెప్పినా చరిత్ర మారదని, ఆయన లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని వ్యాఖ్యానించారు. తొలి 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించామని.. తర్వాత పదేళ్లు తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందించామని గుర్తుచేశారు.
‘‘ప్రధాన ప్రతిపక్ష పార్టీగా సర్కారుకు చెమటలు పట్టిస్తున్నాం… ప్రజల తరఫున ప్రభుత్వంతో బీఆర్ఎస్ కొట్లాడుతుంది.. పార్టీ పని అయిపోయింది.. ఇక మూత పడతుందని అన్నారు.. కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొని నిలబడి పోరాడుతున్నాం.. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి పర్సనాలిటీ పెంచుకుంటారనుకుంటే పర్సెంటేజీలు పెంచుకుంటున్నారు… కాంగ్రెస్ విష ప్రచారాలను నమ్మి బీఆర్ఎస్ను ప్రజలు ఓడించారు’ అని చెప్పారు. వాస్తవానికి పాదయాత్రపై గతేడాది నవంబరులోనే కేటీఆర్ తన మనసులో మాటను బయటపెట్టారు. ఆస్క్ కేటీఆర్ పేరిట ఎక్క్లో వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు.