Champions Trophy: పాకిస్థాన్లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫికి ఉగ్రముప్పు పొంచి ఉంది. భద్రత బలగాలను పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. చాలా ఏళ్ల తర్వా పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. ట్రోఫీ చూసేందుకు వచ్చే విదేశీయులను కిడ్నాప్ చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ కుట్ర చేస్తుంది. చైనా, అరబ్బులను టార్గెట్ చేసినట్టు సమాచారం పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రముప్పు పొంచి ఉందని పాక్ ఇంటలిజెన్స్ వర్గాలు బాంబ్ పేల్చాయి. విదేశీయులే టార్గెట్ గా పలు ఉగ్ర సంస్థలు దాడులకు పాల్పడేందుకు ప్లాన్ వేస్తున్నట్టు పాక్ ప్రభుత్వానికి హెచ్చరించింది. ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ అతిధ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లను తిలకించడానికి వివిధ దేశాల నుంచి భారీగా విదేశీయులు ఇప్పటికే పాక్ చేరుకున్నారు. అయితే ఇపుడు వారి ప్రాణాలకు ముప్పు ఉందని హెచ్చరిస్తున్నాయి నిఘా వర్గాలు.
విదేశీయులను కిడ్నాప్ చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ప్రయత్నిస్తున్నట్టు ప్రభుత్వానికి రహస్య సమాచారం అందినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ లోని ముఖ్య ప్రదేశాలైన ఎయిర్పోర్టులు, ఓడరేవులు, ఆఫీసులు, ఖరీదైన నివాస ప్రాంతాలపై ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ నిఘా వేసిందని ఇంటలిజెన్స్ వెల్లడించింది. ప్రత్యేకంగా పాక్ కు సహాయం చేస్తున్న చైనా, అరబ్ దేశాల నుంచి వచ్చిన వారిని ఉగ్ర సంస్థ లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. దీంతో రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసింది ఆ దేశం. దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.