తాను ఎత్తుకున్న మగపిల్లాడు ‘హోప్’ తన కొడుకేనని చియోమా చాలా గట్టిగా చెప్పారు. ఎనిమిదేళ్లలో చియోమాకి పలుమార్లు గర్భస్రావమైంది. దీంతో ఆ బిడ్డను ఒక మిరాకిల్(అద్భుతం)గా ఆమె భావిస్తున్నారు.
”వీడు నా కొడుకు” అని ఆమె గట్టిగా చెప్పారు.
నైజీరియా రాష్ట్ర ఉన్నతాధికారి కార్యాలయంలో తన భర్త ఇకే పక్కనే ఆమె కూర్చుని ఉన్నారు.
నైజీరియాలోని అనంబ్రా రాష్ట్ర మహిళా, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్గా ఉన్న ఇఫీ ఒబినాబోకు కుటుంబ వివాదాలను పరిష్కరించడంలో చాలా అనుభవం ఉంది. అయితే, ఇది మిగిలిన వివాదాల లాంటిది కాదు.
చియోమా, ఆమె భర్త ఇకే చెబుతున్నట్లుగా.. ఆ గదిలో ఉన్న అయిదుగురు ఇకే కుటుంబ సభ్యులు హోప్ వారికి పుట్టిన బిడ్డేనని నమ్మడం లేదు.
అయితే, తన బిడ్డను దాదాపు 15 నెలలపాటు (నవమాసాలు కాకుండా) కడుపులో మోసినట్లు చియోమా చెబుతున్నారు.
ఇంకా గర్భం దాల్చలేదంటూ ఇకే కుటుంబం ఒత్తిడి చేసేదని, తన భర్తను రెండో పెళ్లి చేసుకోమని కూడా చెప్పారని చియోమా తెలిపారు.
దీంతో నిరాశలో కూరుకుపోయిన ఆమె ”అసాధారణ చికిత్స” అందించే ”క్లినిక్”ను సంప్రదించారు.
తల్లి కావాలని ఆశపడుతున్న ఎంతోమంది మహిళలను దారుణంగా మోసం చేయడంతో పాటు పసికందుల అక్రమ రవాణాకు సంబంధమున్న క్లినిక్ అది.
ఈ క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ స్కామ్పై మా పరిశోధనలో భాగంగా, చియోమాతో కమిషనర్ చర్చించేప్పుడు అక్కడ ఉండేందుకు అధికారులు బీబీసీని అనుమతించారు.
అయితే, ఆయా కమ్యూనిటీల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉండడంతో మేం ఈ కథనంలో చియోమా, ఇకే సహా అందరి పేర్లు మార్చి రాశాం.
నైజీరియాలో ప్రపంచంలోనే అత్యధిక జననాల రేటు ఉంది. గర్భం దాల్చే విషయంలో ఇక్కడి మహిళలపై సామాజిక ఒత్తిడి కూడా ఉంటుంది. ఒకవేళ వారు తల్లులు కాకపోతే దుర్మార్గాలకు, బహిష్కరణకు కూడా గురవుతారు.
ఈ ఒత్తిడి కారణంగా తల్లి కావాలనే తమ కలను నిజం చేసుకోవడం కోసం కొంతమంది మహిళలు ఎంతదూరమైనా వెళ్లేందుకు వెనకాడరు.
బీబీసీ ఆఫ్రికా ఐ ఏడాది కాలంగా ఈ ”క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ” స్కామ్పై ఇన్వెస్టిగేషన్ చేస్తోంది.
వైద్యులు, నర్సుల్లా నటించే స్కామర్లు (మోసగాళ్లు) గర్భం దాల్చేందుకు ”అద్భుతమైన సంతానోత్పత్తి చికిత్స”(మిరాకిల్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్) ఉందంటూ తల్లి కావాలని ఆశగా ఎదురుచూస్తున్న మహిళలను నమ్మిస్తారు. అందుకు వారిని ఒప్పిస్తారు. చికిత్స ప్రారంభించేందుకు వందల డాలర్లు ఖర్చవుతుందని చెబుతారు. ఈ మొదటి దశ చికిత్సలో ఒక ఇంజెక్షన్, ఒక పానీయం, యోనిలో జొప్పించే ఒక పరికరం ఉంటాయి.
బీబీసీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా.. మాతో మాట్లాడిన మహిళలు, అధికారులను ఈ చికిత్స గురించి అడిగినప్పుడు వారిచ్చిన మందుల్లో ఏముంటాయో తమకు కచ్చితంగా తెలియదని చెప్పారు. అయితే, తమ శరీరంలో కడుపు ఉబ్బడం వంటి మార్పులు కనిపించినట్లు కొంతమంది మహిళలు చెప్పారు. దానిని చూపించి వారు గర్భం దాల్చినట్లుగా నమ్మించేవారు.
ఈ చికిత్స తీసుకుంటున్న మహిళలు మామూలు వైద్యుల దగ్గరికి వెళ్లొద్దని స్కామర్లు హెచ్చరిస్తారు. ఏ స్కాన్లోనూ గర్భంలో శిశువు ఉన్నట్లు కనిపించదని, ఎందుకంటే ఈ చికిత్సలో శిశువు గర్భసంచి వెలుపల పెరుగుతుందని స్కామర్లు నమ్మబలుకుతారు.
ఇక బిడ్డను ప్రసవించే సమయం వచ్చినప్పుడు, ”అరుదైన, ఖరీదైన మందులు ఇస్తేనే ప్రసవం అవుతుంది” అని చెబుతారు, దానికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది.
అయితే, ప్రసవం మాత్రం ఒక్కొక్కరికీ ఒక్కోలా జరిగిందని చెబుతున్నారు, అవి కలవరపాటుకు గురిచేసేలా ఉన్నాయి. కొందరికి మెళకువ వచ్చేప్పటికి సిజేరియన్ చేసినట్లు గుర్తు ఉంటుంది. మరికొందరు తమకు ఇంజెక్షన్ ఇచ్చారని, ఆ తర్వాత మగతగా, మత్తులోకి జారుకున్నట్లు అవుతుందని చెప్పారు. అందులో నుంచి బయటికి వచ్చేసరికి ప్రసవం జరిగిపోయిందని నమ్ముతున్నారు.
ఏదేమైనా, ఈ ప్రసవం కథ తాము జన్మనిచ్చామని అనుకుంటున్న శిశువులతో ముగుస్తుంది.
తన ప్రసవం గురించి చియోమా కమిషనర్ ఒబినాబోతో చెప్పారు. డాక్టర్గా చెబుతున్న ఒక వ్యక్తి తన నడుము వద్ద ఇంజెక్షన్ చేశారని, తనను బిడ్డను బయటకు వచ్చేలా పుష్ (నెట్టమని) చేసేందుకు ప్రయత్నించాలని చెప్పారని ఆమె చెప్పారు. కానీ హోప్ ఎలా బయటికి వచ్చాడో ఆమె చెప్పలేకపోయారు. కానీ ప్రసవం చాలా నొప్పితో కూడుకున్నదని ఆమె చెప్పారు.
ఇలాంటి రహస్య క్లినిక్లలో ఒకదానిలోకి వెళ్లి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి బీబీసీ ఇన్వెస్టిగేషన్ బృందం సిద్ధమైంది. డాక్టర్ రూత్గా చెబుతున్న మహిళను కలిసేందుకు ఎనిమిదేళ్లుగా గర్భం దాల్చడం కోసం ప్రయత్నిస్తున్న ఓ జంటగా పరిచయం చేసుకుంటూ ఆమె రహస్య క్లినిక్కు వెళ్లింది.
అనంబ్రాలోని ఇహియాలా పట్టణంలో, ఒక శిథిలావస్థకు చేరిన హోటల్లో ప్రతి నెలా రెండో శనివారం మాత్రమే ”డాక్టర్ రూత్” పేరుతో ఆమె ఈ క్లినిక్ నిర్వహిస్తున్నారు.
ఆమె గది బయట, కారిడార్లో పదుల సంఖ్యలో మహిళలు ఆమె కోసం వేచిచూస్తున్నారు. వారిలో కొందరి కడుపు ఎత్తుగా ఉంది.
అక్కడంతా చాలా సానుకూలంగా ఉంది. ఒకానొక సమయంలో, మీరు గర్భవతి అయ్యారనే మాట విని ఒక మహిళ సంతోషంతో గది లోపల సంబరాలు కూడా చేసుకుంది.
ఆ తర్వాత మా అండర్కవర్ రిపోర్టర్ల వంతు వచ్చింది, వారు ఆమెను కలిసినప్పుడు ఈ చికిత్స కచ్చితంగా ఫలితాన్నిస్తుందని ”డాక్టర్ రూత్” హామీ ఇచ్చారు.
తానొక ఇంజెక్షన్ చేస్తానని, దానితో మగపిల్లాడు కావాలో, ఆడపిల్ల కావాలో కూడా మనమే ఎంపిక చేసుకోవచ్చని ఆమె చెప్పారు.
అయితే, అండర్కవర్ రిపోర్టర్లు ఆ ఇంజెక్షన్ వద్దని చెప్పడంతో, ”డాక్టర్ రూత్” వారికి చూర్ణం చేసిన మాత్రలతో పాటు ఇంట్లో వేసుకునేందుకు మరికొన్ని మందులు ఇచ్చారు. అలాగే, ఎప్పుడు సంభోగంలో పాల్గొనాలో కొన్ని సూచనలు కూడా చేశారు.
ఈ మొదటి దశ చికిత్స కోసం 3,50,000 నైరా ( భారత కరెన్సీలో సుమారు రూ.17 వేలు) ఖర్చవుతుంది.
మా అండర్కవర్ రిపోర్టర్ ఆ మందులు వాడలేదు, ఆమె సూచనలను పాటించలేదు.
నాలుగు వారాల తర్వాత మళ్లీ ఆ డాక్టర్గా చెబుతున్న మహిళ వద్దకు వెళ్లారు. అప్పుడు, అల్ట్రాసౌండ్ స్కానర్ లాంటి ఒక పరికరాన్ని మా రిపోర్టర్ పొట్టపై పెట్టి పరిశీలిచినట్లు అటూఇటూ కదిపి, గుండెచప్పుడు వంటివి విని, కంగ్రాట్స్.. ఇప్పుడు మీరు గర్భవతి అని ”డాక్టర్ రూత్” చెప్పారు.
ఇద్దరూ సంతోషంగా ఉన్నట్లు నటించారు.
గర్భవతి అనే శుభవార్త చెప్పిన తర్వాత, బిడ్డ పుట్టడానికి ”అతి కష్టమ్మీద దొరికే, ఖరీదైన మందుల” కోసం ఎంత కట్టాలో డాక్టర్ రూత్ వివరిస్తారు. వాటి ధర 1.5 మిలియన్ నైరా నుంచి 2 మిలియన్ నైరా. అంటే, భారత కరెన్సీలో దాదాపు లక్ష రూపాయలు చెల్లించాలని చెబుతారు.
తల్లి కడుపులో బిడ్డ ఎంతకాలం ఉంటుందనే శాస్త్రీయ వాస్తవాలను కూడా విస్మరించి, ఈ మందులు వాడకపోతే గర్భాన్ని 9 నెలలకు మించి పొడిగించాల్సి వస్తుందని డాక్టర్ రూత్ చెబుతారు.
‘బిడ్డ పోషకాహార లోపానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది, అప్పుడు మనం మళ్లీ మొదటి నుంచి ప్రయత్నించాల్సి వస్తుంది’ అని చెబుతారు.
ఆమెపై చేసిన ఈ ఆరోపణల గురించి స్పందించాలని బీబీసీ ”డాక్టర్ రూత్”ని సంప్రదించింది. కానీ ఆమె స్పందించలేదు.
అయితే, ఈ చికిత్స తీసుకున్నవారు ఎంతవరకూ ఈ వాదనలను నమ్ముతున్నారనే దానిపై స్పష్టత లేదు.
అయినా, ఎందుకు ఇలాంటి అబద్దాలను నమ్ముతున్నారనే విషయాల గురించి అన్వేషించినప్పుడు, ఆన్లైన్ గ్రూపుల్లో విస్తృతంగా ఉన్న తప్పుడు సమాచారం కారణంగా కొంతవరకూ ఇలా జరుగుతుందని ఆధారాలు లభ్యమయ్యాయి.తప్పుడు సమాచార వ్యాప్తి
క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అనేది వైద్యపరంగా నిరూపితమైంది, ఇందులో తాను గర్భం దాల్చినట్లు ఆమెకు చివరి దశ వరకు తెలియదు.
కానీ, పరిశోధనలో భాగంగా ఆన్లైన్లో అన్వేషించినప్పుడు క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ గురించి ఫేస్బుక్ గ్రూపులు, పేజీల్లో తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నట్లు బీబీసీ గుర్తించింది.
అమెరికాకు చెందిన ఒక మహిళ తన క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పడానికే తన ఫేస్బుక్ పేజీని అంకితం చేశారు. తాను ”ఏళ్ల తరబడి” గర్భంతో ఉన్నానని, సైన్స్ కూడా దానిని వివరించలేకపోయిందని అందులో పేర్కొన్నారు.
మరికొందరు, ఈ బూటకపు చికిత్సను గర్భం దాల్చలేని మహిళలకు ”మహాద్భుతంగా” చూపించడం కోసం ఫేస్బుక్లోని తమ క్లోజ్డ్ గ్రూపుల్లో మతపరమైన పదాలు కూడా వాడుతున్నారు.
ఇబ్బడిముబ్బడిగా వ్యాప్తి చెందుతున్న ఈ తప్పుడు సమాచారం, ఇది నిజమేనన్న నమ్మకాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తోంది.
ఇలాంటి గ్రూపుల్లో కేవలం నైజీరియా నుంచే కాకుండా దక్షిణాఫ్రికా, కరీబియన్, అమెరికా వంటి దేశాల నుంచి కూడా సభ్యులున్నారు.
స్కామర్లు ఈ గ్రూపుల్లో పోస్టులు చేయడం ద్వారా, గర్భం దాల్చేందుకు చికిత్స పొందాలని అనుకుంటున్న మహిళలకు దగ్గరవుతారు.
ఎవరైనా ఈ చికిత్సపై ఆసక్తి చూపితే, వారిని మరింత సురక్షితమైన వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేస్తారు. ఆ గ్రూపుల్లో ”ఎక్కడెక్కడ ఈ క్లినిక్లు ఉన్నాయి, చికిత్స ఎలా ఉంటుంది” అనే వివరాలను తెలియజేస్తారు.
‘నాకింకా గందరగోళంగా ఉంది’
ఈ చికిత్సలో చివరి దశ పూర్తి చేయడం కోసం (అంటే పిల్లలు పుట్టినట్లు సృష్టించడం కోసం), అబార్షన్పై నిషేధం ఉన్న దేశాలకు చెందిన నిస్సహాయులు, నిరాశలో కూరుకుపోయిన యువతులు, గర్భిణుల కోసం స్కామర్లు గాలిస్తారని అధికారులు మాతో చెప్పారు.
2024 ఫిబ్రవరిలో చియోమా ప్రసవం అయిందని చెబుతున్న కేంద్రంపై అనంబ్రా రాష్ట్ర ఆరోగ్య శాఖ దాడులు చేసింది. రెండు భవనాలున్న ఈ కేంద్రంపై జరిగిన దాడుల ఫుటేజీ బీబీసీ వద్ద ఉంది.
వాటిలో ఒక భవనంలో తమ క్లయింట్ల కోసం వైద్య పరికరాలతో కూడిన గదులున్నాయి. మరో భవనంలో బలవంతంగా తీసుకొచ్చి ఉంచిన చాలామంది గర్భిణులు ఉన్నారు. వారిలో 17 ఏళ్ల వయసు వారు కూడా ఉన్నారు.
తమ పిల్లలను స్కామర్లు వారి క్లయింట్లకు అమ్ముతారని తెలియక, మోసపోయి ఇక్కడకు వచ్చామని కొందరు మాతో చెప్పారు.
ఉజు (అసలు పేరు కాదు) లాంటి కొందరు తాము గర్భం దాల్చినట్లు ఇంట్లో చెప్పడానికి భయపడి మరోమార్గంగా ఇక్కడికొచ్చారు. తన బిడ్డ కోసం 800,000 నైరా ( సుమారు 40 వేల రూపాయలు) ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
బిడ్డను అమ్ముకోవాలనుకోవడం తప్పు అని భావిస్తున్నారా అని అడిగినప్పుడు, ”నాకు ఇప్పటికీ గందరగోళంగా ఉంది” అని ఆమె అన్నారు.
చిన్నపిల్లల కోసం ఈ స్కామర్లు ఉజు లాంటి నిస్సహాయులను వెతికి పట్టుకుంటారని కమిషనర్ ఒబినాబో చెప్పారు.
ఉద్వేగభరితంగా సాగిన ఈ విచారణ చివర్లో, పిల్లాడు హోప్ని తీసుకెళ్లిపోతానని కమిషనర్ ఒబినాబో చియోమాని భయపెట్టారు.
కానీ, చియోమా కూడా తన వాదన చెప్పుకున్నారు. తాను కూడా బాధితురాలినేనని, ఏం జరుగుతుందో తనకు తెలియకుండానే జరిగిందని చెప్పడంతో కమిషనర్ కూడా ఆమెతో ఏకీభవించారు.
బిడ్డను తన వద్ద ఉంచుకోవడానికి చియోమా, ఇకే దంపతులను అధికారులు అనుమతించారు. అయితే, ఆ బిడ్డ అసలు తల్లిదండ్రులు వస్తే అప్పగించాల్సి ఉంటుందని సూచించారు.
అయితే, మహిళల పట్ల దృక్పథం, పిల్లలు పుట్టకపోవడం, పిల్లలను కనే హక్కులు, దత్తత వంటి విషయాల్లో మార్పులు రాకపోతే ఇలాంటి మోసాలు పెరుగుతూనే ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.