ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కి చిరస్మరణీయ విజయాన్ని అందించిన అశుతోష్ శర్మ సూపర్ ఇన్నింగ్స్కి క్రికెట్ లోకమే మతిపోయింది. నిన్న (సోమవారం) జరిగిన మ్యాచ్లో చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన సమరంలో, చివరి ఓవర్లో వచ్చిన సిక్సర్తో ఢిల్లీ విజయం అందుకోవడం అభిమానులను ఉర్రూతలూగించింది. కష్టకాలంలో క్రీజులోకి వచ్చిన అశుతోష్, పూర్తి స్థాయిలో తన ఆత్మవిశ్వాసం చూపించి జట్టును గెలుపు బాట పట్టించాడు.

విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభంలో ఢిల్లీ 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన వేళ, అశుతోష్ శర్మ తన ధాటిగల ఆటతీరుతో మ్యాచ్ దిశను పూర్తిగా మలిచాడు. కేవలం 31 బంతుల్లోనే 66 పరుగులు చేసి, చివరి వరకు క్రీజులో నిలిచి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. టెన్షన్తో ఊపిరి ఆడని చివరి ఓవర్లో 6 పరుగులు అవసరమవగా మొదటి బంతికే చేతికి చిక్కిన స్టంప్ ను జారవిడుచుకున్న రిషభ పంత్ రెండో బంతికి మోహిత్ శర్మ సింగిల్ ఇవ్వగా ఆసుతోష్ శర్మ సిక్స్ తో మ్యాచ్ ను ముగించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి దారి చూపించిన మరో కీలక ఆటగాడు విప్రజ్ నిగమ్. కేవలం 15 బంతుల్లో 39 పరుగులు చేసి, ఇన్నింగ్స్కు బలాన్ని అందించడమే కాకుండా మ్యాచ్ మూడే మార్చేశాడు. చివర్లో, అత్యవసర సమయంలో క్రీజులోకి వచ్చిన విప్రజ్, చొరవగా ఆడి ప్రతి బంతిని విలువైనదిగా మార్చాడు. అతని షాట్లు ఢిల్లీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపగా, ప్రత్యర్థి బౌలర్లకు సవాల్గా మారాయి.

లక్నో తరఫున మిచెల్ మార్ష్ (72 పరుగులు – 36 బంతుల్లో), పూరాన్ (75 పరుగులు-30 బంతుల్లో) చేయడంతో 210 భారీ లక్ష్యాన్ని నిర్దేషించగలిగింది. అశుతోష్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. “ఇది ఢిల్లీకి విజయమే కాదు… ఒక నూతన క్రికెట్ తార జన్మించిన రోజు” అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ విజయం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ తమ సీజన్ను విజయవంతంగా ప్రారంభించింది. “ఇంపాక్ట్ ప్లేయర్” రూల్పై కొనసాగుతున్న చర్చల నడుమ అశుతోష్ శర్మ సత్తా చాటిన తీరు, ఈ నియమానికి కొత్త జీవం పోసింది.
ఐపీఎల్ అంటేనే ఉత్కంఠ, ఉల్లాసం, అంచనాలకు అతీతంగా జరిగే మ్యాజికల్ మూమెంట్స్ – ఇవన్నీ కలిసిన మ్యాచ్ ఇదే అని చెప్పవచ్చు!