మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘L2: ఎంపురాన్’. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇది వీరి కాంబినేషన్ లో 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘లూసిఫర్’ కు సీక్వెల్. మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీనిపై తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు.
‘లూసిఫర్ 2’ మూవీ తెలుగు ట్రైలర్ ను ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసారు. ”మాగ్నమ్ ఓపస్ ‘L2: ఎంపురాన్’ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. వన్ అండ్ ఓన్లీ మోహన్ లాల్, నా వరదా పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి 2025 మార్చి 27 నుండి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో తుఫాను సృష్టించబోతున్నారు” అని రాసుకొచ్చాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి డార్లింగ్ సపోర్ట్ గా నిలవడంతో, రెబల్ స్టార్ ఫ్యాన్స్ నుంచి ఈ సినిమాకి మద్దతు లభించే అవకాశం ఉంది.
‘L2: ఎంపురాన్’ సినిమాకి మురళి గోపి కథ అందించారు. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ లతో పాటుగా టోవినో థామస్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుభాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దిల్ రాజుకు చెందిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాని తెలుగులో విడుదల చేయనుంది.