ఐపీఎల్ 2025 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2024 తర్వాత అన్ని ఫ్రాంచైజీలు తమ ప్లేయర్లను వేలంలోకి వదిలేశాయి. దాంతో ఈ ఏడాది జట్లన్నీ మారిపోయాయి. కొత్త కెప్టెన్లు, కొత్త కోచ్లతో అంతా కొత్తకొత్తగా ఉంది. కోల్కతా కెప్టెన్ పంజాబ్కి, పంజాబ్ కెప్టెన్ చెన్నైకి, చెన్నై ప్లేయర్ కేకేఆర్ కెప్టెన్గా ఇలా ఎన్నో మార్పులు జరిగాయి. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్, బౌలింగ్లో పటిష్టంగా ఉండి కప్ కొట్టాలని చూస్తోంది. అందుకోసమే ఆ జట్టు ప్లేయర్లంతా కలిసి పూజలు కూడా చేశారు.
పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సారి అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐపీఎల్ 2024 టైటిల్ అందుకున్న శ్రేయాస్ అయ్యర్ ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాడు. దేశీ ప్లేయర్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఈ జట్టుకు చాలా బలాన్ని చేకూరుస్తారు. ప్రపంచ స్థాయి ఆల్రౌండర్లను ఈ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. వీరితో పాటు బెస్ట్ కోచ్ రికీ పాంటింగ్ను ఎంపిక చేశారు.
ఈ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఎలాగైనా సత్తా చాటాలనే ఉద్దేశంతో ఐపీఎల్ ప్రారంభానికి ముందు పూజ కూడా చేశారు. కేవలం భారతీయులే కాకుండా జట్టులోని ఆటగాళ్లంతా ఈ పూజలో పాల్గొన్నారు. కోచ్ రికీ పాంటింగ్ కూడా పూజ చేయడం విశేషం. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రికీ పాంటింగ్ నేతృత్వంలో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ కప్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది.
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ మార్చి 25న తన తొలి మ్యాచ్ ఆడనుంది. మొదటి మ్యాచ్లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఐపీఎల్ 2024లో ఈ జట్టు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. 14 మ్యాచ్లలో కేవలం ఐదు మ్యాచ్లే గెలిచింది. ఈ సారి ఫైనల్కు తీసుకెళ్లేందుకు రికీ పాంటింగ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.
ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఒక్కసారి పంజాబ్ కింగ్స్ ఫైనల్కు చేరింది. 2014 ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ రన్నరప్గా నిలిచింది. 2008లో సెమీఫైనల్స్కు చేరి ఓటమిపాలయింది. ఇక మిగతా సీజన్లలో ఈ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ సారి బ్యాటింగ్, బౌలింగ్తో బలంగా ఉన్న పంజాబ్ జట్టు ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.
పంజాబ్ కింగ్స్ 2025 స్క్వాడ్
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేర, విష్ణు వినోద్, జోస్ ఇన్గ్లిస్, హర్నూర్ పన్ను, పాయల్ అవినాష్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినీస్, గ్లెన్ మ్యాక్స్వెల్, హర్ప్రీత్ బ్రార్, మార్కో యాన్సన్, అజ్మతుల్లా ఓమర్జాయ్, ప్రియాన్షు ఆర్య, ఆరోన్ హార్డీ, ముషీర్ ఖాన్, సూర్యాన్షు షెడ్జే, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, వ్యాసక్ విజయ్కుమార్, యశ్ ఠాకూర్, లోకీ ఫెర్గ్యూసన్, కుల్దీప్ సెన్, జేవియర్, ప్రవీణ్ దుబే.