PM Kisan 20th Installment: రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన గొప్ప పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకు ఏటా రూ. 6 వేలు ప్రభుత్వం అందిస్తుంది. దీనిని నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే వేస్తుంది. ఇక రూ. 6 వేలు ఒకేసారి రావు. దీనిని ప్రతి 4 నెలలకు ఓసారి 3 విడతల కింద రూ. 2 వేల చొప్పున అందిస్తారు. ఇప్పటివరకు 19 విడతల్లో నిధులు అందించగా.. త్వరలో 20వ విడత నిధులు రానున్నాయి. అయితే ఈ క్రమంలోనే చాలా మంది అర్హత లేని రైతులు కూడా ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తూ లబ్ధి పొందుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం వారిని గుర్తించేందుకు కఠిన నిబంధనలు విధిస్తోంది. ఈ క్రమంలోనే అనర్హులుగా తేలిన వారి నుంచి డబ్బులు వెనక్కి కూడా తీసుకుంటోంది.
2019లో పథకం ప్రారంభం కాగా.. చాలా మంది అనర్హులు కూడా ఈ పథకం కింద డబ్బులు పొందారు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఆ డబ్బును తిరిగి రాబట్టాలని చూస్తోంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. వీరందరి నుండి డబ్బును తిరిగి వసూలు చేస్తోంది. ఇప్పటివరకు ఇలా కేంద్రం.. రూ. 416 కోట్లను తిరిగి వసూలు చేసింది. ఈ మేరకు.. 2025, మార్చి 18న ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PIB) విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.
“అధిక ఆదాయ వర్గాల్లోని రైతుల నుంచి డబ్బును తిరిగి వసూలు చేయాలని రాష్ట్రాలు/UTలకు ఆదేశాలు జారీ చేశాము. ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. వారి నుంచి ఇప్పటివరకు రూ. 416 కోట్లు వసూలు చేశాం” అని PIB తెలిపింది.
ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బును నేరుగా లబ్ధిదారు ఖాతాలోకి పంపిస్తారు. దీనివల్ల మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతులకే డబ్బు అందుతుంది. 100 శాతం అర్హులకు ప్రయోజనాలు అందేలా.. అనర్హుల్ని గుర్తించేందుకు కేంద్రం ఇటీవల ప్రయత్నిస్తోంది. పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన లబ్ధిదారు ఎప్పటికప్పుడు ఇ- కేవైసీ కచ్చితంగా చేసుకోవాలి. ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. భూ రికార్డులు కూడా సరిగా ఉండాలి. ఈ ప్రక్రియలతో మోసాల్ని అరికట్టవచ్చు.
PM-KISAN పథకానికి ఎవరు అనర్హులు?
- భూమి కలిగిన సంస్థలు
- రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు (మాజీ, ప్రస్తుత)
- మంత్రులు, మేయర్లు, జిల్లా పంచాయతీ ఛైర్పర్సన్లు (మాజీ,ప్రస్తుత)
- కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
- నెలకు రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందే రిటైర్డ్ ఉద్యోగులు (Multi Tasking Staff /Class IV/Group D ఉద్యోగులు మినహాయింపు)
- గత అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులు
- డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్లు
కాబట్టి, ఈ వర్గాల ప్రజలు PM-KISAN పథకానికి అనర్హులు. ఒకవేళ మీరు పొరపాటున ఈ పథకం కింద డబ్బులు పొంది ఉంటే, వాటిని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలి. స్వచ్ఛందంగా అనర్హులు.. తమ ప్రయోజనాలు వదులుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ఇందుకోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇదే సమయంలో అర్హత ఉండి చేరని రైతులు.. దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచిస్తోంది. దగ్గర్లోని వ్యవసాయ కార్యాలయాన్ని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా పీఎం కిసాన్ వెబ్సైట్లోనూ చూడొచ్చు.